Chhattisgarh Elections | రాయ్పూర్, నవంబర్ 5: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 7న (మంగళవారం) తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఆయా స్థానాల్లో ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నక్సల్ ప్రభావిత బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, మరో నాలుగు ఇతర జిల్లాల్లో ఈ 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 మంది మహిళలతో పాటు మొత్తం 223 మంది అభ్యర్థులు తొలి విడత బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించాయి. రాష్ట్రంలో 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ 2018లో కాంగ్రెస్కు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉన్నదని సర్వేలు చెప్తున్నాయి. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది.
బఘేల్కు ‘మహదేవ్’ చిక్కులు
ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్కు మహదేవ్ బెట్టింగ్ యాప్తో సంబంధాలు ఉన్నాయని, యాప్ ప్రమోటర్ల నుంచి కోట్లాది రూపాయలు ముడుపులు అందాయన్న ఈడీ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై సీఎం బఘేల్ను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ తన ఎన్నికల సభల్లో విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో మత మార్పిడులు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, ప్రభుత్వం అవినీతి వంటి అంశాలను టార్గెట్గా చేసుకొన్నారు. అయితే బీజేపీలో నాయకత్వం లోపించింది. మాజీ సీఎం రమణ్సింగ్ చురుగ్గా లేరు. దీంతో మోదీ చరిష్మాపైనే బీజేపీ భారం వేసింది. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు.
హామీల అమలులో ‘హస్తం’ విఫలం
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతు రుణాల మాఫీ, 60 ఏండ్లు పైబడిన రైతులకు పింఛను, నిరుద్యోగులకు భృతి, రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధం, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని 2018 ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన కాంగ్రెస్.. వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు. వాగ్దానాల అమలు, సంక్షేమం, అభివృద్ధి మరచిన కాంగ్రెస్ సర్కారు.. అంతర్గత కుమ్ములాటలతో ముగినిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెద్దయెత్తున వచ్చాయి. బొగ్గు రవాణాలో అవినీతి, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, మినరల్ ఫౌండేషన్ నిధుల దుర్వినియోగం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో అవకతవకలు, మత ఘర్షణలు.. ఇవన్నీ కాంగ్రెస్ సర్కారుకు తలనొప్పులు తీసుకొచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.