రాయ్పూర్ : పెగాసస్ స్పైవేర్ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఉదంతంపై విచారణకు చత్తీస్ఘఢ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇజ్రాయల్ కంపెనీ చత్తీస్ఘఢ్కు చెందిన కొందరిని గత బీజేపీ సర్కార్ హయాంలో సంప్రదించిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై తదుపరి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ పేర్కొన్నారు. మాజీ సీఎం రమణ్ సింగ్ గతంలో ఈ ఉదంతంలో ఎవరెవరిని కలిసింది..ఏయే ఒప్పందాలు చేసుకున్నారో వెల్లడించాలని కోరారు.
పెగాసస్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ముమ్మరంగా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు. పెగాసస్ ఉదంతంపై విపక్షాలు బుధవారం రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి ప్రభుత్వం పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందనే వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.