రాయ్పూర్ : ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం చేపడతామని హామీ ఇచ్చిన ప్రస్తుత చత్తీస్ఘఢ్ పాలక కాంగ్రెస్ సర్కార్ సగానికి పైగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతుండటంపై అడిగిన ప్రశ్నను మంత్రి ఏ మాత్రం పట్టించుకోకుండా వింతైన ధోరణితో వ్యవహరించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అమర్జీత్ భగత్ను శనివారం మీడియా ప్రతినిధులు మద్య నిషేధంపై ప్రశ్నించగా మంత్రి దిక్కులు చూశారు.
ఇదే విషయాన్ని విలేకరి మరోసారి రెట్టిస్తూ 2018లో కాంగ్రెస్ పార్టీ మద్యనిషేధాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించిందని గుర్తుచేశారు. దీనికి మంత్రి అమర్జీత్ భగత్ బదులిస్తూ మీరేం అడుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదని అమాయకంగా చూడటంతో విలేకరి విస్తుపోయారు. తాము అధికారంలోకి రాగానే మద్యనిషేధం అమలు చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పాలనా పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.