Encounter : ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ను ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లు మరణించారని, ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా ఛత్తీస్గఢ్లో అతిపెద్ద నక్సల్స్ ఆపరేషన్ అక్టోబర్ 4న అబుజ్మడ్ అడవుల్లో జరిగింది. నక్సలైట్లపై నిర్వహించిన ఆ యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లు మరణించారు.
ఎన్కౌంటర్ జరిగిన పది రోజుల తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఎన్కౌంటర్లో మరణించిన నక్సల్స్ 31 మంది కాదని, మొత్తం 35 మంది అని పేర్కొన్నారు. అక్టోబర్ 18న బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. ఆ ఎన్కౌంటర్లో మొత్తం 38 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు.