హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బీజాపూర్-సుక్మా జిల్లా సరిహద్దుల్లో మావోలతో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధప్రదేశ్లో బోర్డర్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను పెంచారు. సరిహద్దుల వద్ద కూంబింగ్ ఆపరేషన్స్ ఉదృతం చేశారు. సుక్మా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 22 మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ జవాన్లు వీరమరణ పొందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే మరో 30 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అనేక మంది జవాన్లు మిస్సైనట్లు తెలుస్తోంది. కొందరు నక్సల్స్ కూడా మృతిచెందారు. ఎన్కౌంటర్ తర్వాత ఏపీ-చత్తీస్ఘడ్ బోర్డర్లో కూంబింగ్ ఆపరేషన్స్ పెంచేశారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్స్ వద్ద కూడా కూంబింగ్ జరుగుతోంది. మావోల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద కూడా భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
సుమారు 500 మంది సాయుధ నక్సలైట్లు .. దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీతో పాటు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన స్థానిక దళాలు కూంబింగ్ పార్టీపై అటాక్ చేశాయి. గాయపడ్డ నక్సలైట్లు పొరుగు రాష్ట్రాలకు పరారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ బోర్డర్ వద్ద బందోబస్తును పెంచారు. వీఐపీలకు సెక్యూర్టీని కట్టుదిట్టం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దు అంటూ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఏపీ-చత్తీస్ఘడ్తో పాటు ఏవోబీ ప్రాంతాల్లో దళాలను హై అలర్ట్లో ఉంచినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.