రాయ్పూర్: వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మావోయిస్టులు ప్రభావం తీవ్రంగా ఉండే ఈ ప్రాంతంలోని 40 గ్రామాల ప్రజలు 40 ఏండ్లలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించడం అధికారులకు సాధ్యమయ్యేది కాదు.
దీంతో వీరు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. అయితే ఈసీ ఎన్నికల ప్రకటన చేయగానే తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు గ్రూపులు ప్రకటించాయి. ఎన్నికల సంఘం పూర్తి భద్రతా చర్యలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించింది. దీంతో 40 ఏండ్ల తర్వాత ఇక్కడ పోలింగ్ బూత్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ గ్రామాల్లో 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలను సురక్షితంగా మార్చామని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.