న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సందేహం వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) నిర్వహించిన సమావేశంలో ఈసీ పాల్గొనడంపై ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు.
దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు కొద్దిసంఖ్యలోనే నమోదయ్యాయి..వైరస్ పేరుతో బీజేపీ ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతోందా అని చత్తీస్ఘఢ్ సీఎం అనుమానం వ్యక్తం చేశారు. కొద్దినెలల్లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కొవిడ్-19 పరిస్ధితిపై ఈసీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమైన నేపధ్యంలో భూపేష్ బాఘేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
డెల్టా స్ట్రెయిన్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనల నడుమ కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.