న్యూఢిల్లీ: కొత్త పెన్షన్ విధానం కింద నమోదు అయిన రాష్ట్ర ఉద్యోగులకు చెందిన సుమారు రూ.17000 కోట్లను రిఫండ్ చేయాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పాత పెన్షన్ స్కీమ్ను రిస్టోర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నేషనల్ సెక్యూర్టీస్ డిపాజిటరీ లిమిటెడ్ సంస్థ వద్ద మార్చి 31 వరకు సుమారు 17240 కోట్లు డిపాజిట్ అయ్యాయని, ఆ మొత్తాన్ని తిరిగిస్తే వాటిని జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో కలుపుతామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని, బొగ్గు కంపెనీలపై విధించిన అదనపు పన్నును కూడా ఇవ్వాలని సీఎం భగల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.