చెన్నై : ఆమె పీహెచ్డీ విద్యార్థిని.. కానీ ఆ కోర్సుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది.
26 ఏండ్ల వయసున్న జే దేశప్రియ అనే యువతి.. ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోని ఓ ప్రయివేటు కాలేజీలో ఫిజిక్స్లో పీహెచ్డీ చేస్తోంది. పెరంబలూరుకు చెందిన కే సెంథిల్(43) అనే వ్యక్తి చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ డెమన్స్ట్రేటర్గా పని చేస్తున్నాడు. అయితే వీరిద్దరికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సన్నిహితంగా మెలిగారు. లాక్డౌన్ కాలంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దేశప్రియ తనకు దూరమయ్యే అవకాశం ఉందని భావించిన సెంథిల్.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేదంటే.. ఇద్దరం కలిసి సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడుతానని బెదిరించాడు. ఈ క్రమంలో సెంథిల్ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది.
సెంథిల్ను దూరం పెట్టిన దేశప్రియ.. 27 ఏండ్ల వయసున్న అరుణ్ పాండియన్తో ప్రేమలో పడింది. ఉలుందర్పేటకు చెందిన అరుణ్.. కట్టణకులతూరులోని యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. ఇక ఈ ఇద్దరూ కలిసి సెంథిల్ను అంతమొందించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు దేశప్రియ సెంథిల్కు ఫోన్ చేసి.. తన కాలేజీకి పిలిపించుకుంది. సెంథిల్ వచ్చిన కాసేపటికే అరుణ్ కూడా వచ్చాడు. అరుణ్, సెంథిల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దేశప్రియ, అరుణ్ కలిసి సెంథిల్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడ్నుంచి తప్పించుకునేందుకు ఈ ఇద్దరూ ప్రయత్నించినప్పటికీ, స్థానికులు గుమిగూడి వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు వారిని అప్పగించారు.
సెంథిల్కు భార్య ఉన్నప్పటికీ ఆయన దేశప్రియను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తాను దేశప్రియ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. సెంథిల్ వేధింపులు భరించలేకనే అతన్ని హత్య చేసినట్లు దేశప్రియ, అరుణ్ అంగీకరించారు. అయితే సెంథిల్ దంపతులకు ఏడేండ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో.. దేశప్రియను వివాహం చేసుకోవాలని సెంథిల్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు దేశప్రియ పోలీసుల విచారణలో చెప్పింది.