చెన్నై : ఈద్ పార్టీకి అటెండైన ఓ వ్యక్తి బిర్యానీతో పాటు విలువైన నెక్లెస్ను, బంగారు గొలుసును మింగేశాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జ్యువెలరీ స్టోర్లో పని చేసే ఓ మహిళ రంజాన్ పర్వదినం సందర్భంగా తన ఫ్రెండ్స్కు విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు ఆ మహిళ స్నేహితురాలితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హాజరయ్యాడు. ఇక వచ్చిన అతిథులందరికీ బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను వడ్డించారు. స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ కూడా బిర్యానీ ఆరగించాడు. దాంతో పాటు ఆ ఇంట్లోని కప్ బోర్డులో ఉన్న రూ. 1.45 లక్షల విలువ చేసే నెక్లెస్, బంగారు గొలుసును మింగేశాడు.
ఈద్ పార్టీ ముగిశాక.. వచ్చిన అతిథులందరూ ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో బాధితురాలు తన కప్బోర్డును తెరిచి చూసేసరికి అందులోని నెక్లెస్(రూ. 95 వేలు), బంగారు గొలుసు(రూ. 25 వేలు) కనిపించలేదు. దీంతో అతిథులందరినీ ఆమె చెక్ చేసింది. ఎక్కడా కనిపించలేదు. స్నేహితురాలి బాయ్ ఫ్రెండే నగలను దొంగిలించి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మే 4వ తేదీన అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. స్కానింగ్ చేయగా, కడుపులో నెక్లెస్, గోల్డ్ చైన్ ఉన్నట్లు తేలింది. అనంతరం అతనికి ఎనిమా ఇచ్చి.. నెక్లెస్, చైన్ను రికవరీ చేశారు.