శియోపూర్, సెప్టెంబర్ 17: ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు అడుగుపెట్టాయి. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో శనివారం మధ్యప్రదేశ్కు చేరుకున్నాయి. ఇందులో మూడింటిని కునో జాతీయ పార్కు (కేఎన్పీ)లోని స్పెషల్ ఎన్క్లోజర్స్లోకి ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 7 దశాబ్దాల తర్వాత చీతాలు మన గడ్డపై అడుగుపెట్టాయని, ఇదొక చారిత్రక క్షణమని పేర్కొన్నారు.
మనుగడ సాధ్యమేనా?
భారత అభయారణ్యాల్లో ఈ చీతాల మనుగడపై పలువురు వన్యప్రాణుల నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇండియాలో అంతరించిపోయిన చీతాలను తిరిగి రప్పించేందుకే ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించారు. అయితే, ఇందుకోసం ఇతర దేశాలనుంచి వన్యప్రాణులను తీసుకురావడం ‘వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972’ను ఉల్లంఘించడమే అవుతుందని అంటున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలు జన్యుపరంగా భారత్లో ఉన్న చీతాలకు విభిన్నమైనవి. ‘ప్రాజెక్ట్ చీతా’లో పాలుపంచుకొంటున్న ‘చీతా కన్జర్వేషన్ ఫంఢ్’కు ఇంతవరకూ ఇలాంటి ప్రాజెక్టును నిర్వహించిన అనుభవం లేదు. ఇది ప్రపంచంలోనే మొదటి అంతర్ ఖండాంతర వన్యప్రాణి ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్టు. అలాగే, కునో జాతీయ పార్కులో ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు 9 చిరుత పులులున్నాయి. ఆఫ్రికన్ చీతాలను క్వారంటైన్ ఎన్క్లోజర్స్నుంచి అభయారణ్యంలోకి వదిలిపెడితే చిరుత పులుల నుంచి ముప్పు ఉంటుంది. ఈ సమస్యలన్నీ అధిగమించి ‘ప్రాజెక్ట్ చీతా’ ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.