భోపాల్, జూలై 14: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. పార్కులో శుక్రవారం సూరజ్ అనే మగ చీతా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. గత ఐదు నెలల వ్యవధిలో మృతి చెందిన చీతాలలో ఇది ఎనిమిదోది. దీని మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ చీతా మరణంతో కునో పార్కులో పది చీతాలు మాత్రమే మిగిలాయి. కాగా మంగళవారమే తేజా అనే మగ చీతా గాయాలతో మరణించింది.
సంభోగ సమయంలో అయిన గాయాల కారణంగానే అది మృతి చెందినట్టు తర్వాత నిర్ధారించారు. కాగా, ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్ గత ఏడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది, ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునో జాతీయ పార్కుకు తీసుకువచ్చారు. వాటిలో ఆరింటిని అడవిలోకి వదిలిపెట్టగా, మిగిలిన వాటిని పార్కులోని ఎన్క్లోజర్లలో ఉంచారు.