మీరట్, జూన్ 7: దేశంలో కీటకాల పేర్లతో పార్టీల ఆవిర్భావ ధోరణి ప్రారంభమైంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పార్టీ ఏర్పడి సంచలనం సృష్టించగా, తాజాగా యూపీలోని మీరట్లో చీంటీ జనతా పార్టీ (చీమల ప్రజా పార్టీ) ప్రారంభమైంది. మూడు దశాబ్దాల పాటు బీజేపీలో పనిచేసిన మాజీ నేత అనూప్ రాఘవ్ ఒక అసాధారణ పేరుతో ఈ పార్టీని స్థాపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వల్ల పరిష్కారం కాకుండా ఉన్న అట్టడుగు వర్గాలు, సామాన్య పౌరుల కష్టాలను తీర్చడానికి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
కఠిన శ్రమ, క్రమ శిక్షణ, ఐక్యత, పట్టుదలకు ప్రతిరూపం చీమని, ఈ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని తన పార్టీకి చీంటీ జనతా పార్టీ అని నామకరణం చేసినట్టు ఆయన చెప్పారు. అట్టడుగు వర్గాల గొంతును వినిపించే వేదికగా తమ పార్టీ ఉంటుందన్నారు. 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.