డెహ్రాడూన్: ఛమోలీ జిల్లాలోని మానా గ్రామంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి మాట్లాడారు. ఈ ఏడాది ఛార్థామ్కు యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 45 లక్షల మంది భక్తలు ఛార్థామ్ను దర్శించుకున్నట్లు ఆయన వెల్లడించారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలతో ఉత్తరాఖండ్లో ఛార్థామ్ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో జరిగిన కన్వరీ యాత్రలోనూ సుమారు 4 కోట్ల మంది పాల్గొన్నట్లు సీఎం తెలిపారు.
రెండు కొత్త రోప్వే ప్రాజెక్టులకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్, గోవింద్ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు రోప్వేను నిర్మించనున్నారు. వేల కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు.
మానా గ్రామంలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ఆయన స్థానికులు ఏర్పాటు చేసిన మేళాలో పాల్గొన్నారు. డిజిటల్ కనెక్టివిటీ మానా గ్రామానికి కూడా చేరినట్లు ప్రధాని తెలిపారు. క్యూఆర్ కోడ్లు లేదా ఇతర పద్ధతుల్లోనూ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. పర్వత ప్రాంతాల్లో కనెక్టివిటీ ఓ సవాల్ అని, తమ ప్రభుత్వం ఫోర్లేన్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొండల్లో వస్తువుల డెలివరీ కోసం డ్రోన్లను వాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.