Chandrayan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ను విజయవంతమైంది. విక్రయ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్ఫుల్ ల్యాండ్ అయ్యింది. ప్రజ్ఞాన్ రోవర్ సైతం జాబిల్లిపై తిరుగుతూ అమూల్యమైన డేటాను యావత్ ప్రపంచానికి అందించింది. ఈ డేటా భవిష్యత్లో మానవ నివాసంతో పాటు చంద్రుడిపై అనేక పరిశోధనలకు మార్గం సుగమం చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త దేబీ ప్రసాద్ దువారీ చంద్రయాన్-3 మిషన్ విజయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో చేపట్టిన మూడు చంద్రయాన్ మిషన్లు ఊహించినదాని కంటే ఎక్కువగానే సమాచారాన్ని అందజేశాయని, భవిష్యత్లో చంద్రుడిపై మానవ నివాసం ఏర్పాటు, పలు కోణాల్లో చంద్రుడిపై అన్వేషణకు మార్గం సుగమం చేశాయన్నారు.
ఈ మూడు మిషన్లు నీటి మంచు, గతంలో గుర్తించని, ఖనిజాలు, మూలకాల ఉనికితో పాటు చంద్రునిపై ఉష్ణోగ్రత మార్పులను గుర్తించాయన్నారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-1 మినరాలజీ మ్యాపర్ను ఉపయోగించి.. ధ్రువ ప్రాంతంలో 60వేలకోట్ల లీటర్ల నీరు మంచు రూపంలో తొలిసారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ డేటాతో మానవులు ఉండగలిగే సింథటిక్ బయోస్పియర్ను సృష్టించవచ్చని దేబీ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే, చంద్రయాన్-2లో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్లో విఫలమైందని, అయినప్పటికీ ఆర్బిటర్ నాలుగు సంవత్సరాల పాటు చంద్రుని క్షక్షలో తిరుగుతూ కావాల్సినంత డేటా, చిత్రాలను భూమికి పంపిందని పేర్కొన్నారు. చంద్రయాన్-3లో ల్యాండర్ చంద్రుడిపై దిగిన కొద్దిరోజుల్లోనే సల్ఫర్ ఉనికిని గుర్తించి.. డేటాను అందజేసిందన్నారు.
గతంలో ఇంత వరకు కనుగొనని ఖనిజాలు, మూలకాలకు సంబంధించి ఈ డేటాతో పాటు ఇంకా తెలియని ఇతర ఖనిజాలు, మూలకాలకు సంబంధించి అనేక అవకాశాలను సూచిస్తుందని చెప్పారు. అలాగే చంద్రుడి ఉష్ణోగ్రతలపై ఆసక్తికరమైన డేటాను అందించిందన్నారు. అయితే, చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను నమోదు చేసిందన్నారు. ఈ డేటా చంద్రుని ఉపరితలం మానవ నివాస యోగానికి సానుకూలంగా సూచిస్తుందన్నారు. అలాగే ఇస్రో చేపడుతున్న గగన్యాన్పై దువారీ స్పందిస్తూ.. మిషన్లో భాగంగా భూమికి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపి.. తిరిగి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
ఇస్రో గగన్యాన్ ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. అయితే, మొదట రెండింటిలో హ్యుమనాయిడ్ రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపనుందన్నారు. దీంతో అంతరిక్ష నౌకలో మానవ శరీరానికి ఎదురయ్యే సవాళ్లను గుర్తిస్తుందని, ఆ తర్వాత మిషన్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందన్నారు. ఈ స్థాయిలో నైపుణ్యం, సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారన్నారు. ఇదిలా ఉండగా.. శాస్త్రవేత్త దేబీ ప్రసాద్ దువారీకి గత రెండు దశాబ్దాలకుపైగా కోల్కతాలోని బిర్లా ప్లానిటోరియంతో ఆయనకు అనుబంధం ఉన్నది.