తిరువనంతపురం, సెప్టెంబర్ 8: చంద్రయాన్-3 విజయంతో దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతుంటే, ఆ ప్రయోగంలో కీలకంగా పనిచేసిన కొందరు ఉద్యోగులు మాత్రం అర్ధాకలితో గడిపారు. మూడు నెలలుగా జీతాలు లేక వారి కుటుంబాలు తీవ్ర వేదనను అనుభవించాయి. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న కోజికోడ్ ఐటీఐ (పాత పేరు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) ఉద్యోగుల ఆకలి గాథ ఇది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 యాత్రలో చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్ కోసం అత్యంత కీలకమైన పరికరాలను ఈ ఐటీఐ ఉద్యోగులే సరఫరా చేశారు.
ల్యాండర్కు అమర్చిన రిమోట్ మౌంట్ సేఫ్ కవచాలు (ఆర్ఎంఎస్ఏ), హెడ్ మౌంట్ రక్షణ కవచాలను ఇక్కడి నుంచే పంపించారు. కానీ, ఈ సంస్థ ఉద్యోగులకు మాత్రం మూడు నెలల నుంచి జీతాలే ఇవ్వటం లేదు. దీంతో చంద్రయాన్-3 చంద్రుడిపై దిగిన రోజు దేశమంతా సంబురాలుచేసుకొని మిఠాయిలు పంచుకొంటున్న సమయంలో ఈ సంస్థ ఉద్యోగులు ఖాళీ ఎన్వలప్లు పంపిణీ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఓనం పర్వదినానికి కూడా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవటంతో పండుగపూట పస్తులుండాల్సి వచ్చిందని ఉద్యోగులు వాపోయారు.