Chandrayan-3 | న్యూఢిల్లీ, ఆగస్టు 8: చంద్రయాన్-3 ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా? అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. ల్యాండర్ విక్రమ్ ఇంజిన్లు విఫలమైనా, సెన్సార్లు పనిచేయకపోయినా.. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేట్టు ‘విక్రమ్’ను డిజైన్ చేశామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ తెలిపారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ప్రొపల్షన్ సిస్టమ్ సమర్థంగా పనిచేస్తే చాలు.
విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ను ఏదీ అడ్డుకోలేదు. అయితే ఇస్రో ముందు అసలైన సవాల్.. చంద్రుడి కక్ష్య నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోతుండగా.. దానిని నిట్టనిలువుగా మార్చటం. ఈ ప్రక్రియ వద్దే చంద్రయాన్-2 విఫలమైంది. కంప్యూటర్ అల్గారిథమ్స్, కావాల్సిన ఇంధనం, ఎంతదూరంలో చంద్రుడి ఉపరితలం ఉందన్న లెక్క.. కీలకమవుతాయి’ అని చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్-3 మరో మూడు కక్ష్యలను దాటాల్సి ఉంది. వీటిని ఇస్రో ఈ నెల 9, 14, 16 తేదీల్లో చేపట్టబోతున్నది. చివరికి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేర్చుతారు.