బెంగళూరు, అక్టోబర్ 27: చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది. ఆగస్టు 23న ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై అడుగుపెట్టే క్రమంలో శివశక్తి పాయింట్ వద్ద పెద్ద మొత్తంలో దుమ్ము, ధూళి, చిన్న చిన్న రాళ్లు పైకిలేచాయని, దాదాపు 2.06 టన్నులమేర మట్టి 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థానభ్రంశం చెందినట్టు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు.
దీనికి సంబంధించి తాజా వివరాల్ని ఇస్రో ‘ఎక్స్’లో విడుదల చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి పైపొరలోని పదార్థాలు (దుమ్ముధూళి, ఖనిజ, రాళ్ల శకలాలు వంటివి) పక్కకు జరిగినట్టు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ఆ పదార్థాలతో భారీ వలయాకార పరిధి ఏర్పడినట్టు ఇస్రో పేర్కొన్నది.