బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 వడివడిగా జాబిల్లి వైపు పరుగులు పెడుతున్నది. ల్యాండర్ విక్రమ్కు జాబిల్లి సమీపంలో ఘన స్వాగతం లభించింది. ‘వెల్కమ్ బడ్డీ’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్.. ల్యాండర్ మాడ్యూల్ను ఘనంగా స్వాగతించింది. చంద్రయాన్-2, చంద్రయాన్-3 మధ్య టూ- వే కమ్యూనికేషన్ను ఇస్రో ఏర్పరిచింది. ‘రెండు మూన్ మిషన్ల మధ్య టూ-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేశాం. ల్యాండర్ మాడ్యూల్ను చేరుకునేందుకు మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ (ఎంవోఎక్స్)కు మరో మార్గం లభించింది’ అని ఇస్రో ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
ల్యాండింగ్ సైట్ను వెతుకుతున్న విక్రమ్
చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగు పెట్టేందుకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చంద్రుడికి మరింత చేరువైన ల్యాండర్ సురక్షితమైన ల్యాండింగ్ సైట్ను వెదికే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి ల్యాండింగ్కు అనువైన ప్రాంతా న్ని విక్రమ్ వెతుక్కుంటున్నది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాడెన్స్ కెమెరా (ఎల్హెచ్డీఏసీ) సాయంతో భూమికి కనిపించని చంద్రుడి దక్షిణ భాగం చిత్రాలను ల్యాండర్ చిత్రీకరించింది. వీటిని ఇస్రో సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నది.
పొరపాట్లు జరిగినా సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రయాన్-3 ల్యాండర్లో అంతర్గతంగా పొరపాట్లు జరిగినా.. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి తీరుతుందని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన ఏరోస్పేస్ సైంటిస్ట్, ప్రొఫెసర్ రాధాకాంత్ పాధి ధీమా వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ రాధాకాంత్ చంద్రయాన్-2, 3 ప్రయోగాల్లో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుత చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లో అంతర్గతంగా సాల్వేజ్ మోడ్ ఉంది. అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తినా… ఈ టెక్నాలజీ కారణంగా దానంతట అదే సరిచేసుకుంటుంది. తద్వారా సాఫ్ట్ల్యాండింగ్ సులువవుతుంది. ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయిన తట్టుకునేలా దాన్ని రూపొందించారు. ఆరు సిగ్మా బౌండ్లతో చంద్రయాన్-3 ల్యాండర్ మరింత పటిష్ఠంగా ఉంది.
ప్రతికూల పరిస్థితి ఎదురైతే 27కు వాయిదా!
ప్రతికూల పరిస్థితులు ఎదురైతే విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేస్తామని ఇస్రో, స్పేస్ అప్లికేషన్ సెంటర్(అహ్మదాబాద్) డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ చెప్పారు. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశం యావత్తు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టడానికి రెండు గంటల ముందు పరిశీలన జరుగుతుంది. చంద్రుడి ఉపరితలంలో పరిస్థితులు, విక్రమ్ ల్యాండర్ పనితీరును పరిగణనలోకి తీసుకుంటాం. సవ్యంగా లేదనిపిస్తే సాఫ్ట్ ల్యాండింగ్ను 27కు వాయిదా వేస్తాం’ అని దేశాయ్ వివరించారు.