రాంచీ/హైదరరాబాద్,(నమస్తే తెలంగాణ) ఫిబ్రవరి 2: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సొరేన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీబీ రాధాకృష్ణన్ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆలంగీర్ ఆలమ్, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్త రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. జేఎంఎం, దాని సంకీర్ణ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 67 ఏండ్ల చంపయీ సొరేన్ జార్ఖండ్కు 12వ ముఖ్యమంత్రి. జార్ఖండ్ రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉంటానని, హేమంత్ సొరేన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాకు తెలిపారు. కుట్ర చేసి ఒక గిరిజన సీఎంను ఎలా అరెస్ట్ చేశారో దేశమంతా చూస్తున్నదన్నారు. అనంతరం తొలిసారిగా చంపయీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నెల 5న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది.
భూ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపుతూ ప్రత్యేక ఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు సుప్రీంకోర్టులో హేమంత్ సొరేన్కు ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
జార్ఖండ్ క్యాంపు రాజకీయాలకు తెలంగాణ వేదికగా నిలిచింది. ఆ రాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణం చేసిన చంపయీ 5న బల నిరూపణ చేసుకోవాలి. దీంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హైదరాబాద్ క్యాంపునకు తరలించారు. జేఎంఎం సర్కార్లో కాంగ్రెస్ భాగస్వామి కావడంతో ఈ క్యాంప్కు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆతిథ్యం ఇస్తున్నది. శుక్రవారం రాంచీ నుంచి 2 ప్రత్యేక విమానాల్లో 40 మంది ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్రావు స్వాగతం పలికి శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్కు తరలించారు.