West Bengal | కోల్కతా, ఫిబ్రవరి 19: సందేశ్ఖాలీ కేసు.. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్నది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖాశర్మ డిమాండ్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలి గ్రామంలో ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖాశర్మ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పర్యటించింది. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘బాధిత మహిళలతో మాట్లాడిన తర్వాత, అక్కడ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టమైంది. అత్యంత భయానక అనుభవాలున్నాయని అనేకమంది మహిళలు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలో ఓ మహిళపై రేప్ జరిగింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. బెంగాల్లో రాష్ట్రపతి విధించాలి’ అని ఆమె అన్నారు.
సందేశ్ఖాలీ కేసులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలోనూ ఎస్సీ జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరింది. ఇదిలా ఉండగా, సందేశ్ఖాలీ హింసపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసును మణిపూర్ పరిస్థితులతో పోల్చవద్దని, కేసుపై రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకోవటమే సముచితమని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళలపై తృణమూల్ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్ఖాలీలో గతకొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఇది దుమారం రేపుతున్నది.