న్యూఢిల్లీ: ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు గత 20 ఏళ్లుగా ఎర్రచందనం పెంపకం, ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. వాణిజ్యపరమైన ఆంక్షలు, ఎగుమతులపై నిషేధంతో ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిపోయింది. ఈ ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కొంతమంది ఎర్రచందనాన్ని అక్రమంగా పండించి, ఎగుమతులు చేసుకుని కోట్లు గడించారు.
2004లో కేంద్ర ప్రభుత్వం ఎర్ర చందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష పరిధిలోకి తెచ్చింది. దాంతో ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నో అనుమతులు తీసుకుంటే తప్ప చట్టబద్ధంగా ఎర్ర చందనాన్ని పండించేందుకు కానీ, ఎగుమతి చేసేందుకు కానీ అవకాశం లేకుండా పోయింది. దాంతో అప్పటివరకు ఎర్ర చందనం పండిస్తున్న రైతులు నష్టపోయారు. స్మగ్లర్లు అక్రమ రవాణాలో కోట్లు గడించారు. ఇప్పుడు కేంద్రం ఎర్ర చందనం రైతులకు ఊరటనిచ్చింది.
ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు స్విట్లర్లాండ్ రాజధాని జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు (కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా) లో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ మేరకు దేశంలో కూడా ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.