ముంబై: మహారాష్ట్రకు రెమ్డెసివిర్ సరఫరా చేయవద్దని ఎగుమతి కంపెనీలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వారిని బెదిరించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వానికి మరో దారి లేక ఎగుమతిదారుల వద్ద ఉన్న రెమ్డిసివిర్ స్టాక్ను సీజ్ చేసి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ కోసం 16 ఎగుమతి కంపెనీలను సంప్రదించామని నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే మహారాష్ట్రకు సరఫరా చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తమకు చెప్పినట్లు ఆ కంపెనీలు వెల్లడించడంపై ఆశ్చర్యపోయామని ఆయన అన్నారు. ఒక వేళ రెమ్డెసివిర్ను మహారాష్ట్రకు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దవుతాయని ఆ కంపెనీలను కేంద్రం హెచ్చరించిందని ఆయన ఆరోపించారు.
దేశంలో కరోనా మరణాలు పెరుగడంతో ప్రధాని మోదీపై నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పించారు. కరోనా టీకాల క్రెడిట్ పొందేందుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్పై మోదీ ఫోటో ముద్రిస్తున్నారని ఆరోపించారు. అదే మాదిరిగా కరోనాతో చనిపోయిన వారి మరణ ద్రువీకరణ పత్రంపైనా మోదీ ఫోటోను ముద్రించవచ్చు కదా అని ఎద్దేవా చేశారు.