Union Govt : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో యూఏఈ (UAE) కి చెందిన చమురు ట్యాంకర్ల (Oil tankers) పై ఇటీవల ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనకు సంబంధించి భారత్ (India) లోని ఇరాన్ రాయబార కార్యాలయ (Iran Embassy) డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావెద్ హుస్సేనీ (Mohamd Javed Husseni) ని విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది.
ఒమన్కు సమీపంలోని హర్మూజ్ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న ‘మొంబాసా’, ‘అల్ బహియాహ్’ చమురు ట్యాంకర్లపై ఇటీవల దాడి జరిగింది. ఈ దాడిలో ‘మొంబాసా’ నౌకలో పనిచేస్తున్న ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడగా, వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రెండు నౌకలకు భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది.
ఈ పరిణామంపై స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని స్పష్టంచేసింది. దేశ భద్రత, ప్రజలు, జాతీయ ప్రయోజనాలు, కీలక ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.