న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం పంపిన 10 ప్రతిపాదనలను పునఃపరిశీలించాలంటూ తిరిగి పంపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చెప్పారు. గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. ‘జడ్జీల నియామకాలు, ఇతర విషయాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి 10 ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను పునఃపరిశీలించాలంటూ తిరిగి సుప్రీంకోర్టు కొలీజియంకు పంపాం. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనే’ అని రిజుజు తెలిపారు. కాగా, తాము పంపిన ప్రతిపాదనలను కేంద్రం తొక్కిపెడుతున్నదని, లేదా తిరిగి పంపుతున్నదని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ చర్యను సమర్థించుకునేలా కేంద్రమంత్రి రిజిజు మాట్లాడారు.
న్యాయవ్యవస్థలో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు పాటించాలన్న నిబంధన లేదని రిజిజు చెప్పారు. కానీ జడ్జీల పేర్లు ప్రతిపాదించే ముందు ప్రాతినిధ్యం లేని వర్గాలను దృష్టిలో ఉంచుకోవాలని కొలీజియానికి సూచించారు. సుప్రీంకోర్టులో 69 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.