ముంబై: కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేయడానికి ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇదే విషయమై కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కరోనాను ప్రకృతి విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని ఉద్ధవ్ కోరారు. ‘ప్రకృతి విపత్తుగా గుర్తించడం వల్ల రాష్ట్ర ప్రకృతి వైపరీ త్యాల నివారణ నిధిని వాడుకోవచ్చు. వ్యాధిబారిన పడిన వారికి సాయం చేయొచ్చు’ అని పేర్కొన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అధికార నివాసంలో పనిచేసే ఉద్యోగులందరికీ కరోనా సోకింది. నాలుగు రోజుల టీకా ఉత్సవ్లో భాగంగా 1,28,98,314 డోసులను ప్రజలకు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.