న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు చేసిన సవరణలను గురువారం నోటిఫై చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, తదితర అంశాలపై ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ప్రచురణ లేదా ప్రసారమయ్యే అయ్యే వార్తలు ఫేక్ లేదా వాస్తవమైనవా? అని నిర్ణయించేందుకు ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’ను ఐటీ శాఖ ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆన్లైన్ మాధ్యమాల్లో వచ్చే వార్తలపై విశేషాధికారం ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు లభిస్తుంది. ఏదైనా వార్తను ఫేక్ అని ఈ యూనిట్ నిర్ధారిస్తే సోషల్మీడియా సహా అన్ని వేదికలు ఆ సమాచారాన్ని తప్పక తొలగించాల్సి ఉంటుంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి?
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’ ఫేక్ లేదా తప్పు దోవ పట్టించేలా ఉన్నదని పేర్కొన్న కంటెంట్ను తమ వేదికల నుంచి తొలగించేందుకు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు, ఎయిర్టెల్, జియో, వీఐ వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తగిన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా సంస్థలు అటువంటి పోస్టులను తొలగించాలి, అదే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆ కంటెంట్కు సంబంధించిన లింకులను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయని పక్షంలో థర్డ్ పార్టీ కంటెంట్కు వ్యతిరేకంగా కేసుల నుంచి ఉన్న రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
నిపుణుల ఆందోళనలు ఏంటి?
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొత్త నిబంధనలు వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా, ఆన్లైన్ ప్రసంగాలను అడ్డుకొనే విధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు, నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి న్యూస్ పబ్లిషర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీకి చెందిన డిజిటల్ రైట్స్ గ్రూపు ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ పేర్కొన్నది. ఫేక్ న్యూస్ అవునా కాదా అనేది నిర్ణయించడంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా నిబంధనలతో పీఐబీకి అపరిమిత అధికారులు లభిస్తాయని పేర్కొంటున్నారు. పీఐబీపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను వెరిఫై చేసేందుకు 2019లో పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అయితే ఇది నిజానిజాలపై దృష్టి పెట్టకుండా, ప్రభుత్వ మౌత్పీస్గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఏ న్యూస్పై ఫ్యాక్ట్ చెకింగ్ చేయాలో, దేన్ని వదిలేయాలో అన్నది కూడా పీఐబీనే నిర్ణయంచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
చర్చలు జరపాలి
ఐటీ రూల్స్కు చేసిన తాజా సవరణలు క్రూరమైనవిగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మండిపడింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు ఫేక్ లేదా వాస్తవమేనా అనేది తేల్చేందుకు కేంద్రం తనకు తాను అధికారం ఇచ్చుకొన్నదని విమర్శించింది. కొత్త సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఎడిటర్స్ గిల్డ్.. అంతకుముందు హామీ ఇచ్చినట్టుగా మీడియా సంస్థలు, ప్రెస్ సంఘాలతో చర్చలు జరుపాలని కోరింది. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్కు సంబంధించి పర్యవేక్షణా యంత్రాంగాన్ని కూడా నోటిఫికేషన్లో పేర్కొనలేదని తెలిపింది. అదేవిధంగా కంటెంట్ను తొలగించడం లేదా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసే విషయంలో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా న్యాయసమీక్ష లేదా అప్పీల్ చేసుకొనే హక్కుకు సంబంధించిన అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.