న్యూఢిల్లీ: కరోనావల్ల దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్కూళ్ల పునఃప్రారంభంపై మార్గదర్శకాలు జారీ చేయనున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి విధివిధానాలు, సలహాలు ఇవ్వాలని నిపుణులకు కోరినట్లు తెలిపాయి.
దేశంలో కరోనా మహమ్మారి కాలుమోపినప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాలు కరోనా ప్రభావం తగ్గినప్పుడు స్కూళ్లను తెరుస్తూ, మళ్లీ కేసులు పెరుగగానే మూసివేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం తన నూతన మార్గదర్శకాల్లో స్కూళ్ల పునఃప్రారంభంపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కాగా, 2019 డిసెంబర్లో దేశంలో కరోనా విజృంభించగా దాదాపు ఏడాది తర్వాత టీకా అందుబాటులోకి వచ్చింది. 2021 జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, పారిశుద్ధ్య కార్మికులకు, 60 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇచ్చారు. 2021 మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్లు ఇస్తున్నారు.