Emergency in Power Supply | విద్యుద్చక్తి కొరతను ఎదుర్కొనేందుకు కేంద్రం ఎమర్జెన్సీ నిబంధన తీసుకొచ్చింది. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్లలో విద్యుద్చక్తిని ఉత్పత్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. విద్యుత్ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు అనుమతించింది. ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను అనుమతించబోమని తేల్చేసింది. దిగుమతి బొగ్గు ఆధారిత ప్లాంట్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేంద్రం ఆశాభావంతో ఉంది. ఈ ఉత్పత్తి కేంద్రాల పూర్తి సామర్థ్యం 17,600 మెగావాట్లు. ఇప్పటికే అధిక వ్యయం ద్వారా 7,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అనుమతించింది.
ఏడాది క్రితం పరిస్థితులతో పోలిస్తే దిగుమతి చేసుకున్న బొగ్గు ధర నాలుగు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీపీఏలను మూసేసింది. కేంద్ర విద్యుత్ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతినిధులతో కూడిన కమిటీ.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన దిగుమతి బొగ్గు కొనుగోలు ధరను ఖరారు చేస్తుంది.
వేడి గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా 20 శాతం విద్యుత్కు డిమాండ్ పెరిగింది. దీంతో విద్యుత్ సంక్షోభానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఉత్పత్తి ప్రారంభానికి విద్యుత్ చట్టంలోని సెక్షన్-11ను అమల్లోకి తీసుకొచ్చింది. దేశీయ బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో రోజువారీగా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో దేశీయ బొగ్గు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును మిళితం చేయడం వల్ల ఖర్చు తగ్గించొచ్చు. 2015-16లో 37 మిలియన్ల టన్నుల బొగ్గును దేశీయ బొగ్గుతో మిళితం చేశారు.
దేశీయ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రాలు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్శాఖమంత్రి ఆర్కే సింగ్ సూచించారు. కాప్టివ్ మైన్స్ నుంచి బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్ కం రోడ్ మోడ్లో బొగ్గు సరఫరా చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు.
ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర విదేశీ బొగ్గు దిగుమతి కోసం ఆర్డర్లు పెట్టాయి. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు త్వరలో బొగ్గు దిగుమతి కానున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ టెండర్ల ప్రక్రియ చేపట్టాయి. హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ఇంకా టెండర్లను పిలవలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టదాయకంగా భావిస్తున్న 100కి పైగా బొగ్గు గనులను తిరిగి తెరవాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నది.