న్యూఢిల్లీ : దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైన నేపధ్యంలో ఈ కరోనా వేరియంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రాబల్య స్ట్రెయిన్గా ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్-19 కేసులు అనూహ్యంగా ఎగబాకుతున్నాయి. దేశంలో పలు నగరాల్లో ఒమిక్రాన్ ప్రాబల్య స్ట్రెయిన్గా ప్రబలుతోందని, ఒమిక్రాన్ కట్టడికి ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడటం నివారించాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్నారు.
టాటా ఎండీతో భాగస్వామ్యంతో ఒమిక్రాన్ను గుర్తించే ఆర్టీపీసీఆర్ కిట్ను ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిందని, దీనికి డీసీజీఐ ఆమోదం లభించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడి 108 మరణాలు సంభవించాయని వెల్లడించారు. గత 8 రోజుల్లో భారత్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగాయని చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 29న 0.79 శాతంగా ఉన్న వైరస్ పాజిటివిటీ రేటు కేవలం వారం రోజుల్లో జనవరి 5 నాటికి 5.03 శాతానికి ఎగబాకిందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు పది శాతం పైగా నమోదవుతోంది.