న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియలో కేంద్ర రక్షణశాఖ సోమవారం మార్పులను ప్రకటించింది. ఆధునీకరణ డ్రైవ్లో భాగంగా సాయుధ బలగాలు దేశీయ పరిశ్రమల నుంచే చాలా వరకు మిలటరీ హార్డ్వేర్ను పొందాల్సి ఉంటుందని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దిగుమతులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది.
దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో భారత రక్షణ రంగ పరిశ్రమపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇంటిగ్రిటీ ప్యాక్ట్ బ్యాంక్ గ్యారంటీ(ఐపీబీజీ) అవసరాన్ని కూడా తొలగించాలని మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్నది. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే అన్ని కొనుగోళ్లకు సంబంధించి బిడ్ సెక్యూరిటీగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ) తీసుకుంటామని పేర్కొన్నది.