న్యూఢిల్లీ, నవంబర్ 17: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషుల రెమిషన్ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం కాలేకపోయిందని అందులో పేర్కొంది.
శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి సున్నిత కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, దేశ మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో వారు దోషులుగా తేలారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయడం అంతర్జాతీయంగానూ తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించింది. తీర్పును సమీక్షించాలని కోరింది. ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఈ నెల 11న కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.