న్యూఢిల్లీ, జనవరి 3: నీట్-పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 6న జరగాల్సి ఉన్న కేసు విచారణను 4వ తేదీకి లిస్ట్ చేయాలని అభ్యర్థించింది. ఇందుకు కొంత ఆవశ్యకత ఉందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఏస్ బోపన్నలతో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీనిపై స్పందించిన బెంచ్ ఈడబ్ల్యూఎస్ కోటా అంశాన్ని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్నదని, కేసు లిస్టింగ్ కోసం తాను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కోరుతానని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మంగళవారం కుదరకుంటే బుధవారం అయినా కేసును విచారించాలని ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు.