తిరువనంతపురం: కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళకు రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కోసం ఇది సహాయపడుతుందని చెప్పారు. మెడిసిన్ పూల్ కోసం ప్రతి జిల్లాకు కోటి చొప్పన అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సోమవారం తిరువనంతపురం వెళ్లిన మన్సుఖ్ మాండవియా, సీఎం విజయన్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీనా జార్జ్తో కలిసి కేరళలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో టెలీ మెడిసన్ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్పై ఊహాగానాల నేపథ్యంలో ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల ఐసీయూ, పది కిలో లీటర్ల ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్ను ఏర్పాటు చేస్తామని మన్సుఖ్ మాండవియా చెప్పారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ డాక్టర్ సుజీత్ కె సింగ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కేంద్ర ఆరోగ్య మంత్రి వెంట ఉన్నారు.