చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ 2023కు సంబంధించి అన్ని కేటగిరీల్లో కటాఫ్ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం ఎంకే స్టాలిన్ దీనిపై గురువారం స్పందించారు. నీట్కు ఎలాంటి విలువ లేదని, దీని ప్రయోజనం సున్నా అని కేంద్రం కూడా అంగీకరించిందని ఎద్దేవా చేశారు. నీట్ పీజీ కటాఫ్ను జీరోకు తగ్గించడం ద్వారా, నీట్ అర్థరహితమని కేంద్ర ప్రభుత్వం గ్రహించిందని అన్నారు. నీట్ వల్ల కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని మరోసారి విమర్శించారు. నీట్కు మెరిట్తో సంబంధం లేదన్నది తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు.
కాగా, తమిళనాడు ప్రభుత్వం తొలి నుంచి నీట్ను వ్యతిరేకిస్తున్నది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను రద్దు చేసింది. యూపీయే ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు ప్రతిపాదనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్లో అడ్మిషన్లు కల్పిస్తున్నది. అయితే నీట్ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఆమెదించిన బిల్లును రాష్ట్రపతి ముర్ము ఇంకా ఆమోదించలేదు.