న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న 6 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలను పంపింది. కరోనా కేసుల నమోదు అధికంగా ఉన్న కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయి. కరోనా నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉన్నత స్థాయి ప్రజారోగ్య బృందాలు తమ సహాయ సహకారాలు అందిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. కరోనా నియంత్రణలో ఆరు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై ఈ బృందాలు అవగాహన పెంచుకోవడంతోపాటు కరోనా నియంత్రణ చర్యల అడ్డంకులను తొలగించడం ద్వారా ఆయా కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని తెలిపింది. ఈ ఆరు రాష్ట్రాల్లో కరోనా నిర్వహణ, టెస్టింగ్, నిఘా, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి వాటిని ఈ కేంద్ర బృందాలు పర్యవేక్షిస్తాయని వెల్లడించింది.