న్యూఢిల్లీ, జూన్ 2: ఉజ్వల పథకం కింద తీసుకొన్న సిలిండర్లకు రాయితీ ఇస్తామన్న బీజేపీ ప్రకటనలోని అసలు కుట్ర బయటపడింది. పేద ప్రజల కోసం ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని కేంద్రమే భరిస్తుందన్న ఆర్థిక మంత్రి నిర్మల మాటల్లోని కపటత్వం తేటతెల్లమైంది. ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉజ్వల మినహా మిగతా అన్ని రకాల కనెక్షన్లపై ఇప్పటివరకు ఉన్న సబ్సిడీని ఎత్తివేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చర్యకు పూనుకొన్నది. ఈ విషయాన్ని చమురు మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ జైన్ గురువారం వెల్లడించారు. ‘ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్పై రాయితీ ఉంటుంది. మిగతావారు మార్కెట్ ధరలకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఈ సబ్సిడీ ఎత్తివేతను ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ అన్న పేరుతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించింది.
ప్రత్యక్ష నగదు బదిలీతోనే
కేంద్రంలో బీజేపీకి ముందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో గ్యాస్పై సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని వినియోగదారుడు చెల్లించాల్సి వచ్చేది. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే చమురు కంపెనీలకు ఇచ్చేది. మోదీ సర్కారు ఈ విధానాన్ని మార్చింది. సబ్సిడీలను నేరుగా కంపెనీలకు చెల్లించడంతో అవినీతి జరుగుతున్నదని, వినియోగదారులకు అసలు ధర తెలియడం లేదని, ఎక్కువ చెల్లిస్తున్నారని చెప్తూ ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ని తీసుకువచ్చింది. దీని ప్రకారం.. సిలిండర్ మొత్తం ఖర్చును వినియోగదారుడే చెల్లించాలి. సిలిండర్పై ఎంత సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ మొత్తం తిరిగి వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది.
సబ్సిడీ తగ్గింపు.. సిలిండర్ ధర పెంపు
ప్రత్యక్ష నగదు బదిలీ విధానం వల్ల గ్యాస్పై సబ్సిడీ ఎంతో, అసలు ధర ఎంతో వినియోగదారుడికి తెలుస్తుందన్నది బీజేపీ వాదన. చెప్పినట్టుగానే కేంద్రం కొన్ని రోజులు వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తూ వచ్చింది. వినియోగదారులు గ్యాస్ రీఫిల్ చేసుకొన్న ప్రతీసారి బ్యాంకుకు వెళ్లి సబ్సిడీ తమ ఖాతాలో జమైందో లేదో చూడటం కష్టంగా ఉండటంతో మానేశారు. ఈ క్రమంలోనే కేంద్రం గ్యాస్పై సబ్సిడీని తగ్గిస్తూ వచ్చింది. కరోనా సాకుతో మొత్తం నిలిపివేసింది. మరోవైపు సిలిండర్ రేటు క్రమంగా పెరుగుతూ పోయింది. రూ.వెయ్యి మార్కును దాటింది.
సబ్సిడీలకు మంగళం..
దేశవ్యాప్తంగా గృహావసరాల కోసం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఉజ్వల పథకం కింద తీసుకొన్నవి 9 కోట్లు. కరోనా ముందు వరకు అన్ని రకాల కనెక్షన్లపై కేంద్రం సబ్సిడీ ఇచ్చేది. కరోనా నేపథ్యంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే సబ్సిడీని నిలిపివేశారు. తాజాగా, ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ఉంటుందని ప్రకటించడం ద్వారా మిగతా కనెక్షన్ల సబ్సిడీకి కేంద్రంలోని బీజేపీ సర్కారు మంగళం పాడింది. అంటే 9 కోట్ల కనెక్షన్లకు సబ్సిడీ ఇచ్చి 21 కోట్ల కనెక్షన్ల సబ్సిడీని ఎత్తివేసింది. కొసరు చూపి అసలుకు ఎసరు పెట్టింది. ఢిల్లీలో ప్రస్తుతం 14.2కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,003గా ఉంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. మిగతావారు రూ.1,003 చెల్లించాలి. 2010లో కేంద్రం పెట్రోల్పై సబ్సిడీని ఎత్తివేసింది. 2014లో డీజిల్పై సబ్సిడీని ఎత్తివేసింది. ఈ సమయంలో అప్పుడు అధికారికంగా ప్రకటన చేశారు.
గతంలో సబ్సిడీ ఎలా
బీజేపీ కంటే ముందు ప్రభుత్వాలు సిలిండర్ ధరను నిర్ణయించేవి. సబ్సిడీకి కొంత మొత్తాన్ని కేటాయించేవి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్ల కోటా ఉండేది. ఈ కోటాలో సిలిండర్లకు రాయితీ ఉండేది. అంతర్జాతీయ మార్కెట్ను బట్టి సిలిండర్ ధర పెరిగితే ఆ భారాన్ని సబ్సిడీ నిధుల్లో నుంచి కేంద్రం భరించేది. చమురు కంపెనీలకు డబ్బు చెల్లించేది. అందువల్ల మార్కెట్తో సంబంధం లేకుండా సిలిండర్ ధరల్లో స్థిరత్వం ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్ పేరుతో ప్రతి నెలా సిలిండర్ రేట్లు పెంచడం పరిపాటి అయింది.