దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ సమ్మె ప్రభావం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై పడొద్దని, ఎప్పటి లాగే ప్రజలకు కరెంట్ సరఫరా సాగుతూ వుండాలని కోరింది. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. అదనపు సిబ్బందిని రెడీగా ఉంచాలని, ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కేంద్రం తన లేఖలో సూచించింది. ఈ రెండు రోజుల్లో షట్డౌన్ కార్యక్రమాలను రూపొందించుకుంటే.. వాటిని మరో తేదీలకు మార్చుకోవాలని కూడా సూచించింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సిద్ధండా ఉండాలని కేంద్రం ఆ లేఖలో తెలిపింది.
ఈ రెండు రోజుల పాటు కంట్రోల్ రూమ్ ముఖ్య అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. అత్యవసర సర్వీసులైన ఆస్పత్రి, రక్షణ రంగం, రైల్వేలు ఎలాంటి ఇబ్బందులూ పడొద్దని, పూర్తి సన్నద్ధంగా ఉండాలని కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ రెండు రోజుల పాటు అధికారులందరూ విధిగా విధులకు హాజరు కావాలని బెంగాల్ సర్కార్ తేల్చి చెప్పింది.
కేంద్రం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు, ఉద్యోగులు, ఎలక్ట్రిక్ సిబ్బంది, రవాణా సిబ్బంది, బ్యాంకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ట్రేడ్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ఈ కారణంగానే రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నట్లు నేతలు తెలిపారు.