న్యూఢిల్లీ, నవంబర్ 13: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్ప ఆలోచనలతో, సంకల్పంతో ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వపు ‘పంజరంలో చిలుకలు’గా మారి రాజకీయ ప్రతీకార కేంద్రాలుగా పరిణామం చెందాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ని కేంద్రంలోని మోదీ సర్కారు రాజకీయ ప్రతీకార దాడులకే వాడుకొంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014 తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలను పరిశీలిస్తే ఈ ఆరోపణలు నిజమే అని అనిపించక మానదు. ఈడీ ఇంకో అడుగు ముందుకేసి ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను బీజేపీలోకి మారేలా బెదిరింపులకు దిగుతున్నదని కొందరు నేతలు చెప్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల్లో అతి పురాతనమైనది సీబీఐ. దీన్ని బ్రిటిష్ కాలంలోనే 1941లో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎస్పీఈ) చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధానికి సంబంధించిన వ్యవహారాల్లో లంచం, అవినీతి కేసులను దర్యాప్తు చేసేందుకు దీన్ని నెలకొల్పారు. 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (డీఎస్పీఈ) ప్రకారం దీనికి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు 1963లో దీనికి సీబీఐగా పేరు మార్చారు. సీబీఐ అధికారాలను కూడా పెంచి వ్యవస్థీకృత నేర ముఠాలు పాల్పడే తీవ్రమైన నేరాలు, కేంద్ర ద్రవ్య చట్టాల్లో అవకతవకలపై కేసులను దర్యాప్తు చేసే వీలు కల్పించారు. 1980 దశకం నుంచి సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ ప్రతీకారాల కోసం వాడుకోవటం ప్రారంభించాయి. 2004-14 మధ్య అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సీబీఐని జేబు సంస్థగా వాడుకొన్నది. సీబీఐ ఏదైనా రాష్ట్రంలో కేసుల దర్యాప్తు చేపట్టాలంటే ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఈ సంస్థను కేంద్రం రాజకీయ ప్రతీకారాలకు వాడుకొంటుండటంతో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, మేఘాలయ, తెలంగాణ రాష్ర్టాలు సీబీఐకి సాధారణ అనుమతిని రద్దుచేశాయి.
2013లో సుప్రీంన్యాయమూర్తి ఓ కేసు విచారణ సందర్భంగా సీబీఐని ‘పంజరంలో చిలక’ అని వ్యాఖ్యానించారంటే దాని పనితీరు ఎటువైపు మళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ లక్ష్యాలు పూర్తిగా మారిపోయాయి. 2014 నుంచి నేటి వరకు ఈడీ 121 మంది రాజకీయ నేతలపై కేసులు పెట్టి దర్యాప్తు చేసింది. ఇందులో 115 మంది ప్రతిపక్ష నేతలే.
మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ వార్తల్లో తప్పనిసరిగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు ఈడీ. ఫారిన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ చట్టం-1947ను ఉల్లంఘించిన కేసులను దర్యాప్తు చేసేందుకు 1956 మే 1న కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో ఎన్ఫోర్స్మెంట్ పేరుతో చిన్న సంస్థగా దీన్ని ఏర్పాటుచేశారు. 1957లో ఈ సంస్థకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని పేరు మార్చారు. 1960లో ఈ సంస్థ రెవెన్యూశాఖ పరిధిలోకి వచ్చింది. 1973లో ఫెరా-1947 చట్టాన్ని పునర్వ్యవస్థీకరించి దాని పరిధిలోకి తెచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 అమల్లోకి రావటంతోనే ఈడీకి విశేషాధికారాలు దఖలు పడ్డాయి. ఆర్థిక నేరాలు జరిగే అవకాశం ఉన్నదని భావిస్తే ఎవరినైనా ముందుస్తుగా అరెస్టు చేసే అధికారం ఈడీకి ఉన్నది.
ఈడీ వివాదాస్పద కార్యకలాపాలు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ని 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఉగ్రదాడులను నిరోధించటం, దాడులపై దర్యాప్తు చేయటం ఈ సంస్థ ప్రధాన విధి. ఉగ్రవాద దాడి అని అనుమానం వచ్చిన ఏ కేసునైనా ఎన్ఐఏ స్వాధీనం చేసుకోగలదు.
2014 తర్వాత ఈ సంస్థ పౌర సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలను టార్గెట్ చేసిందని ఎన్ఐఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థకు దేశంలోని ఏ మూలలోనైనా సొంతంగా దర్యాప్తు చేపట్టే విస్తృత అధికారాలున్నాయి.