Schools reopening : కరోనా కారణంగా పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దాదాపుగా అన్ని రాష్ట్రాలూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. కొందరు ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అవి అమలులో లేవు. కరోనా పెరుగుతుందా? తగ్గుతుందా? తగ్గితే పాఠశాలలు పునః ప్రారంభించాలా? వద్దా? అన్న మీమాంసలో రాష్ట్రాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అతి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కొన్ని సలహాలను కూడా ఇవ్వనుంది. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పాఠశాలలను పునః ప్రారంభించాలన్న డిమాండ్లు కూడా తల్లిదండ్రుల నుంచి విపరీతంగా వచ్చిపడుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ పాఠశాలల పునః ప్రారంభంపై నిపుణులతో ఓ కమిటీని వేసింది. పాఠశాలలను పునః ప్రారంభిస్తే, తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలతో పాటు కొన్ని సలహాలను కూడా ఈ కమిటీ రాష్ట్రాలకు సూచిస్తుంది.
అయితే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే పాఠశాలల పునః ప్రారంభ తేదీలను ప్రకటించేశాయి. అయితే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు. అటు విద్యార్థులు, టీచర్లు విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందేనని పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.