Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తీవ్రస్థాయిలోకి చేరకముందే ఆంక్షలు విధించాలని తెలిపింది. ఆంక్షలు విధిస్తే అవి కనీసం 14 రోజుల పాటు అమలులో ఉండాలని వెల్లడించింది. అలాగే పండుగ సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పింది. పండుగ వేళ ఒమిక్రాన్ కట్టడి కోసం రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని.. కరోనా బాధితుల నమూనాలను వెంటనే జీనోమ్ సీక్వెన్స్కు పంపాలని.. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరుచూ పరిశీలన జరగాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ప్రధాని మోదీ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్లో కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై హోంశాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో మోదీ చర్చిస్తున్నారు.