న్యూఢిల్లీ, జనవరి 29: ఇంటర్ సిటీ, స్కూల్ బస్సుల్లోని ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఫైర్ అలారం, ఫైర్ కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. దీనిపై రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 27 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఫైర్ అలారం, కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అయితే వాహనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై అధ్యయనం చేసినప్పుడు.. ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో పొగ, వేడి వల్లే ప్రయాణికులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారని తేలింది. దీన్ని నివారించడానికి ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో నీటి తుంపర్లు వెదజల్లే యంత్రం, ప్రత్యేకమైన అలారాన్ని డిజైన్ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇది కంపార్ట్మెంట్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చేస్తుందని, పొగను అదుపు చేస్తుందని తెలిపింది. తద్వారా ప్రయాణికులు దిగడానికి ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నది.