న్యూఢిల్లీ, జూలై 18: దేశవ్యాప్తంగా రైతులు భయపడుతున్నదే జరిగింది. సర్కారు మరోసారి రైతు చట్టాలపై వంచనకు సమకట్టింది. పార్లమెంటులో మరోసారి రైతుల ఆందోళన ప్రతిధ్వనిస్తుందనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా కనీస మద్దతుధరపై కమిటీని నియమిస్తూ నోటిఫికేషన్ తెచ్చింది. మోదీ సర్కార్ మోసం చేస్తుందని రైతులు భయాందోళనలు చెందుతూనే ఉన్నారు. అనుమానించినట్టుగానే కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటుచేసిన కమిటీ.. మద్దతు ధరపై వంచన చేసేందుకు.. దొడ్డిదారిన నల్ల చట్టాలను తిరిగి తెచ్చేందుకేనని తేటతెల్లమైంది. కమిటీ నియామకం, సభ్యుల ఎంపిక, ఎజెండాలోని అంశాలు కేంద్రం పన్నాగాన్ని నిగ్గు తేలుస్తున్నాయి.
2021, 19 నవంబర్ రోజున ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే సుదీర్ఘమైన, సమరశీలమైన రైతుల ఆందోళనకు తలొగ్గి.. జాతికి క్షమాపణ చెప్తూ.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సందర్భంలో, కనీస మద్దతు ధరపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం తలచుకుంటే కమిటీ ఏర్పాటుకు ఏడెనిమిది గంటలు కూడా పట్టేది కాదు. కానీ కమిటీ ఏర్పాటుకు ఎనిమిదిన్నర నెలల కాలం ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు.
మొదటి నుంచి ప్రశ్నిస్తున్న ఎస్కేఎం
రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆనాడే కమిటీ ఏర్పాటుపై కేంద్రాన్ని పూర్తి వివరణ కోరింది. తన సందేహాలను స్పష్టంగానే వ్యక్తంచేసింది. నిజంగానే కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నారా? కమిటీ చైర్మన్గా ఒక రైతు ఉంటారా? ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలను సమర్థించేవారితో కమిటీని నింపేయరు కదా? రైతు ప్రతినిధులను ఎస్కేఎం నుంచే తీసుకొంటారా? లేక ఇతర ప్రతినిధులను చేరుస్తారా? అని ప్రశ్నించింది.
తమ సందేహాలపై స్పష్టత వస్తేనే కమిటీలో చేరతామని కూడా తెగేసి చెప్పింది. అంతేకాదు.. కమిటీ ఎజెండా ఏమిటి? ఏయే అంశాలపై పనిచేస్తుంది? అని నిలదీసింది. ఈ వ్యవహారంలో రైతు నేతలు అడిగింది ప్రధానంగా ఒకటే విషయం. కనీస మద్దతు ధరపై చట్టం రూపొందించడం అనేది కమిటీ పరిధిలోని అంశంగా ఉంటుందా? సూటిగా చెప్పాలని నిలదీశారు. దీనిపై ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణా రాలేదు. తమ ప్రశ్నలపై స్పష్టత రాకపోవడం వల్లనే రైతు నేతలు ఎలాంటి పేర్లనూ ప్రభుత్వానికి ప్రతిపాదించలేదు. మొన్నటి మార్చిలో ప్రభుత్వం పేర్లు ఎందుకు పంపడం లేదంటూ ఫోన్లో సంప్రదించింది.
మీరు కమిటీ మార్గదర్శకాలు వెల్లడిస్తే.. మేం నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు కేంద్రానికి స్పష్టంచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం జవాబు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. జూలై 3 సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నది. కమిటీ మార్గదర్శకాలు తేలేదాకా అందులో చేరే ప్రసక్తే లేదని ప్రకటించింది. తరువాత జూలై 12న కేంద్రం గుట్టు చప్పుడు కాకుండా కమిటీని ఏర్పాటుచేస్తూ నోటిఫికేషన్ను విడుదలచేసింది. ఎంత దారుణమంటే.. కమిటీ ఏర్పాటు విషయం ఎస్కేఎం నేతలకు కూడా చెప్పలేదు. ఈ విషయం రైతు నేతలకు సోమవారమే తెలిసింది.
కమిటీ సభ్యులుగా నల్ల చట్టాల తయారీదారులు
దొడ్డి దారిన నల్ల చట్టాలు తెస్తారని రైతులు భయపడుతున్నదే నిజమైంది. కమిటీ చైర్మన్గా రైతును నియమించాలన్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోనే లేదు. మొన్న మార్చి 31 వరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సంజయ్ అగర్వాల్ను ఎంఎస్పీ కమిటీ చైర్మన్గా నియమించింది. మూడు నల్ల చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు నలుగురిలో ఈయన ఒకరు. చివరి నిమిషం వరకు రైతు చట్టాలు మంచివేనని, రైతుల సంక్షేమం కోసం తెచ్చినవేనని, రైతులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడిన వ్యక్తి అగర్వాల్. ఈయన ఇప్పుడు కమిటీ అధ్యక్షుడు. ఇక రెండో వ్యక్తి రమేశ్చంద్. వ్యవసాయ ఆర్థికవేత్త. కానీ సర్కారు తరపున మూడు నల్లచట్టాల ముసాయిదా తయారుచేసే బాధ్యత నిర్వహించారు.
ప్రభుత్వాన్ని సమర్థించేందుకు ఎవరూ సిద్ధంగా లేనప్పుడు టీవీ స్టూడియోలకు వచ్చి సర్కారుకు అండగా గట్టిగా నోరు విప్పింది ఈయనే. కమిటీలో మొత్తం 29 మంది ఉన్నారు. 21 మంది సర్కారు ప్రతినిధులే. రైతు ప్రతినిధుల జాబితా కింద ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు. అందులో ఎస్కేఎం మూడు పేర్లు ఖాళీగా వదిలేసి మరో ఐదుగురి పేర్లు కేంద్రమే ఖరారుచేసింది. రైతు ప్రతినిధుల విషయంలో రైతునేతల అనుమానాలు నిజమయ్యాయి. ఎస్కేఎం నేతృత్వంలో నడిచిన రైతు ఆందోళనను ద్వేషించిన, ఘోరంగా దూషించిన, ఆందోళనను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నిన, సర్కారు నల్ల చట్టాలను అడ్డంగా సమర్థించిన రైతు ప్రతినిధులను తెచ్చి నెత్తిమీద కూర్చోబెడతారన్న భయం నిజమైంది. సర్కారీ తొత్తుల కమిటీయే వస్తుందన్న రైతు నేతల మాట అక్షరాలా నిజమైంది.
ఎస్కేఎం ప్రతినిధుల కోసం వదిలిపెట్టిన మూడు ఖాళీలు పోగా మరో ఐదుగురు రైతు ప్రతినిధుల ఖాతాలో నింపారు. వారు ఎవరంటే.. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన సయ్యద్ పాషాపటేల్. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ. మూడు నల్లచట్టాల సమర్థకుడు. రెండోవ్యక్తి ప్రమోద్కుమార్ చౌదరి. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచే రైతుసంస్థ భారతీయ కిసాన్ సంఘ్కు చెందిన వ్యక్తి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు. ఈయన ఆరెస్సెస్ వ్యక్తి అనేది బహిరంగ రహస్యమే. మూడో వ్యక్తి గుణిప్రకాశ్. హర్యానాలో బీకేయూకు అధ్యక్షుడు. టీవీ చర్చల్లో రైతు నేతలను తిట్టేందుకు మాత్రం ప్రభుత్వం ఈయనను వెతికి పట్టుకొచ్చిందనేది మాత్రం అందరికీ తెలుసు.
కృష్ణవీర్ చౌధరి భారతీయ కృషక్ సమాజ్కు చెందిన వ్యక్తి. శరద్ జోషి షేత్కరీ సంఘటన్ చీలిక వర్గానికి చెందిన ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకొన్న సంగతి తెలిసిందే. మూడు నల్లచట్టాల వల్ల రైతులకు కలిగే మేలు గురించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గుణవంత్ పాటిల్ గతంలో చేసిన పని. నల్లచట్టాల వల్ల రైతులకు ప్రపంచ మార్కెట్ లభిస్తుందంటూ వరల్డ్ బ్యాంకు విధానాలను బాహాటంగా సమర్థించినవాడు. రైతు కోటాలో కమిటీలో దూరిన ఈ ఐదుగురు ఏం చేస్తారు? ముగ్గురు ఎస్కేఎం నేతలను కమిటీలో చిన్నగీతగా చేసేందుకే ఈ ఐదుగురి పెద్దగీత సర్కారు గీసింది.
కమిటీ ఎజెండాలోని మూడు అంశాలు