హైదరాబాద్ : మంకీపాక్స్ ( Monkey pox ) పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు, గుర్తింపు, చికిత్సపై గత నెలలో మార్గదర్శకాలు విడుదల చేశామని గుర్తు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు ఈ వ్యాధి విస్తరించిందని, నమోదైన కేసుల్లో 86 శాతం ఐరోపా, 11 శాతం అమెరికా దేశాల్లో వెలుగుచూశాయని పేర్కొన్నది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మరోసారి మంకీపాక్స్ను ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ప్రజలు రాష్ట్రంలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా పెట్టాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందించాలని కోరింది.