హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ర్టాలకు పంపిణీ చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ డిమాండ్చేశారు. అందరం కలిసి ఈ డిమాండ్ను కేంద్రం ముందుంచుదామని 11 బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజయన్ సోమవారం లేఖలు రాశారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సేకరణ, అందరికీ ఉచిత టీకా కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామని పేర్కొన్నారు. ‘సహకార సమాఖ్య స్ఫూర్తితో 11 మంది సీఎంలకు లేఖ రాశాను. టీకాల సేకరణ, ఉచిత సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటి తన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకుంటున్నది’అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్లు సమకూర్చుకొనే బాధ్యత పూర్తిగా రాష్ర్టాల పరిధిలోనిదేనన్న ప్రకటనలు సహకార సమాఖ్య వ్యవస్థ మూలాన్నే వ్యతిరేకించడమన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రస్తుత పరిస్థితిని ఆసరా చేసుకొని లాభపడాలని చూస్తున్నాయని విమర్శించారు.
కేంద్రం నేరుగా రాష్ర్టాలకు వ్యాక్సిన్ పంపిణీచేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. డిమాండ్కు తగినట్టుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేని ఈ సమయంలో టీకాల కొనుగోలు భారాన్ని కేంద్రం రాష్ట్రాలపై పడేసిందని ఆరోపించారు. ఆర్థికభారమైనప్పటికీ, ప్రజల ఆరోగ్య రక్షణకోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలువాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. అయినప్పటికీ విదేశీ కంపెనీలు రాష్ర్టాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రావడం లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. థర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో టీకాల భారాన్ని రాష్ట్రాలపై మోపడం సరికాదని హితవుపలికారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే సమాఖ్య వ్యవస్థ బలంగా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు సగటున 3.1 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు అందాయని విజయన్ తన లేఖలో చెప్పారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మా కంపెనీలకు టీకా ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదని, కేంద్రం చొరవతీసుకొని మేథో హక్కులు, పేటెంట్ చట్టాల వంటి అడ్డంకులను తొలగించాలని, కంపల్సరీ లైసెన్సింగ్ విధానాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని డిమాండ్చేశారు.