న్యూఢిల్లీ: చిరుత పులులపై పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్, ఇతర అటవీ ప్రాంతాల్లో చిరుత పులులను ఈ టాస్క్ఫోర్స్ పర్యవేక్షించనుంది.
ఈ టాస్క్ఫోర్స్ కమిటీలోని సభ్యులు చిరుతల వృద్ధిని, వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటవీ సిబ్బందికి, వెటర్నరీ వైద్యులకు తగు సూచనలు ఇవ్వనున్నారు. ఎన్క్లోజర్లలో లోపాలు, భద్రతా లోపాలపై కూడా టాస్క్ఫోర్స్ దృష్టిసారించనుంది. చిరుతల వేటాడే నైపుణ్యాలు, వాతావరణంతో వాటి సర్దుబాటును కూడా టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుంది.
టాస్క్ఫోర్స్ కమిటీలో మధ్యప్రదేశ్ అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్, రిటైర్డ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.