న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మెడిసిన్స్, కాస్మొటిక్స్, మెడికల్ డివైజెస్కు సంబంధించి కొత్త చట్టం రూపకల్పనకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అధిపతి వీజీ సోమానీ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ఔషధాలు, కాస్మొటిక్స్ దిగుమతులు, తయారీ, సరఫరా, అమ్మకానికి సంబంధించి 1940లో డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టానికి సవరణ చేసి మెడికల్ డివైజెస్ను కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో చేయాల్సిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ కొత్త బిల్లును రూపొందించాల్సిందిగా కేంద్రం నిపుణుల కమిటీకి సూచించింది. నవంబర్ 30 నాటికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నది. కాగా, కొత్త బిల్లు అవసరాన్ని ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించాయి. పాత చట్టం వల్ల ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే, బిల్లు రూపకల్పన, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం వంటివి ముగియడానికి కనీసం ఏడాది పడుతుందని, అప్పుడే కొత్త చట్టం అమల్లోకి వస్తుందని తెలిపాయి.