న్యూఢిల్లీ/చండీగఢ్, అక్టోబర్ 2: వరి రైతుపై కేంద్ర ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్నది. కేంద్రం వివక్షపూరిత విధానాలతో అన్నదాతకు గడ్డుకాలం దాపురిస్తున్నది. తాజాగా పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలును వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సాధారణంగా హర్యానాలో సెప్టెంబర్ 25 నుంచి, పంజాబ్లో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు మొదలవుతుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల ధాన్యంలో తేమ శాతం అనుమతించిన దానికంటే ఎక్కువ ఉన్నదంటూ కొనుగోలును అక్టోబర్ 13కు వాయిదా వేసింది. దొడ్డురకం ధాన్యం కొనేది లేదనడంతో పాటు పలు నిబంధనలు విధిస్తున్న కేంద్రం… ధాన్యం కొనుగోలును ఆలస్యం చేయాలని చూస్తుండటం రైతుల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ధాన్యాన్ని రైతులు మండీలకు తరలించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై పంజాబ్, హర్యానా వ్యాప్తంగా రైతుల నిరసనలు భగ్గుమన్నాయి. దీంతో కేంద్రం దిగి వచ్చింది. ఆదివారం నుంచే రెండు రాష్ర్టాల్లోనూ ధాన్యం కొనుగోలును ప్రారంభిస్తామని శనివారం ప్రకటించింది.
రైతుల ఆగ్రహ జ్వాల
కర్ణాల్లో హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ నివాసంతో పాటు పంజాబ్, హర్యానాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్లను రైతులు ముట్టడించారు. వారి ఇండ్ల ముందు ధాన్యం లోడు ట్రాలీలను నిలిపి నిరసన తెలిపారు. కర్ణాల్లో రైతులపై పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. షహబాద్, పంచకులలో బీజేపీ నాయకుల ఇండ్ల చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. వాటిని రైతులు ట్రాక్టర్లతో విరగ్గొట్టారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి సమస్యా లేకుండా చూడాలని హర్యానాలోని బీజేపీ, పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి.