న్యూఢిల్లీ, ఆగస్టు 4: పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. పెగాసస్, రైతుల సమస్యలపై చర్చకు అంగీకరించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. ఈ మేరకు 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 18 మంది నాయకులు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభుత్వం బురద జల్లుతున్నదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారానికి ఒడిగట్టిందని ఆ ప్రకటనలో విమర్శించారు. ఉభయ సభల్లో చర్చ జరుగాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ఒప్పుకోకుండా ప్రభుత్వం అహంకారపూరితంగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.
ఆరుగురు తృణమూల్ ఎంపీల సస్పెన్షన్
పెగాసస్ గూఢచర్యంపై ఆందోళన సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు బుధవారం సస్పెండ్ చేశారు. పెగాసస్ తదితర అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు రోజూ ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్నాయి. అలాగే బుధవారం తృణమూల్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కొందరు ఎంపీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. వారిని వెనక్కి వెళ్లి వారి సీట్లలో కూర్చోవాలని వెంకయ్యనాయుడు కోరారు. అయినా వారు పట్టించుకోలేదు. దాంతో ఆ ఎంపీలను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు.
గందరగోళం నడుమే బిల్లుల ఆమోదం
ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్సభ, రాజ్యసభలో బుధవారం చెరో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోపు డిపాజిటర్లకు డీఐసీజీసీ నుంచి రూ.5 లక్షలు ఇచ్చే సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వ్యక్తిగత డాటా పరిరక్షణ బిల్లుకు సంబంధించిన జాయింట్ కమిటీలో ముగ్గురు సభ్యుల నియామకానికి లోక్సభ ఆమోద ముద్ర వేసింది.
ఐదేండ్లలో 1.71 లక్షల రేప్ కేసులు
ఐదేండ్ల కాలంలో (2015-2019 వరకు) దేశంలో 1.71 లక్షల లైంగికదాడి కేసులు నమోదయ్యాయని కేంద్రం పార్లమెంట్లో తెలిపింది. అత్యధికంగా మధ్యప్రదేశ్ (22,753), రాజస్థాన్ (20,937), ఉత్తరప్రదేశ్ (19,098)లో చోటుచేసుకున్నాయని పేర్కొంది. గత ఆరేండ్లలో కేంద్ర సాయుధ పోలీసు దళాలకు (సీఏపీఎఫ్) చెందిన 680 మంది సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడ్డారని వెల్లడించింది. 2015 నుంచి 2020 మధ్య కాలంలో సీఏపీఎఫ్ సిబ్బంది 1,764 మంది ప్రమాదాల్లో, 323 మంది ఎన్కౌంటర్లలో మరణించారు. మరోవైపు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మళ్లీ సవరణలు చేసే ఆలోచనేమీ లేదని కేంద్రప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.