న్యూఢిల్లీ, నవంబర్ 20: పలు హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లకు ఆమోదం తెలుపకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. మోదీ సర్కార్ జడ్జీల బదిలీకి ఆమోదం తెలుపని పేర్లలో గుజరాత్ హైకోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై సోమవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన కొలీజియం సిఫారసు చేసిన పేర్లపై కేంద్రం అనుసరిస్తున్న ‘పిక్ అండ్ చూజ్’ విధానం సరికాదని, ఆమోదనీయం కాదని, ఇది మంచి సంకేతం పంపదని జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ సుధాంశు ధులాయ్ కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ విధమైన విభజన విధానానికి వెంటనే స్వస్తి పలకాలని సూచించింది. పలు హైకోర్టుల్లోని 11 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేయగా.. అందులో ఐదు పేర్లకు మాత్రమే ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం, మరో ఆరుగురి పేర్లను పెండింగ్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీలు పెండింగ్లో ఉన్న న్యాయమూర్తుల్లో గుజరాత్ హైకోర్టు జడ్జీలు నలుగురు, అలహాబాద్, ఢిల్లీ హైకోర్టుల నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. ‘గుజరాత్ హైకోర్టు నుంచి నలుగురు జడ్జీల బదిలీకి కూడా ఆమోదం తెలుపలేదు. దీని ద్వారా మీరు ఏం సంకేతం పంపాలనుకొంటున్నారు?’ అని ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణిని ప్రశ్నించింది. ‘చూడండి, ఒక దశలో ఏం జరుగుతుందంటే.. ఆయా కోర్టుల నుంచి మేం బదిలీ చేయాలనుకొనే న్యాయమూర్తులను మీరు అక్కడనే పనిచేయించలేరు. ఇది సరికాదు. దీని పర్యావసానాలను మీరు అర్థం చేసుకోవాలి. అదే జరిగితే న్యాయమూర్తులు ఇబ్బంది పడుతారు, అధికారం పలుచన అవుతుంది. దయచేసి అలా జరుగకుండా చూడండి’ అని కేంద్రానికి హితవు పలికింది.
గతంలోనూ ఇలాగే..
ఇటీవల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం సిఫారసు చేసిన వాటిలో ఎనిమిది మంది పేర్లను కేంద్రం క్లియర్ చేయలేదని, వీరిలో కొంతమంది ఇప్పటికే నియామకం పొందిన వారి కంటే సీనియర్లు కూడా ఉన్నారని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో పాటుగా కొలీజియం పలుమార్లు సిఫారసు చేసిన మరో ఐదు పేర్లకు కూడా కేంద్రం స్పందన తెలపకపోవడాన్ని గుర్తుచేసింది. ఇంకా, జూలైలో పంపిన మూడు పేర్లకు సంబంధించి కొలీజియంకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్పుట్స్ రాలేదని, టైమ్లైన్ గడువు ముగిసినందుకు వీటిని ప్రస్తావిస్తున్నానని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. ఈ విధమైన ‘పిక్ అండ్ చూజ్’ విధానంపై గతంలో కూడా ఇదేవిధంగా అభ్యంతరం వ్యక్తం చేశామని, ఇది ఎంతమాత్రం ఆమోదనీయం కాదని సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా కూడా ఉన్న జస్టిస్ కౌల్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి స్పష్టం చేశారు.
ఒక్కసారి మీరు చూస్కోండి
కొలీజియం సిఫార్సులను ఆమోదించడంలో కేంద్రం జాప్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొలీజియం సిఫార్సుల ఆమోదం విషయంలో 2021లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పెట్టిన కాలపరిమితిని ఉల్లంఘిస్తున్న కేంద్రంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఓ పిటిషన్ వేసింది. న్యాయమూర్తుల బదిలీల విషయంలో ఎంపిక విధానం అనుసరించొద్దని జస్టిస్ కౌల్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నొక్కిచెప్పారు. ‘మీరు అనుసరిస్తున్న విధానాన్ని ఒక్కసారి చూడండి. దీని ద్వారా మీరు ఏ విధమైన సంకేతం పంపుతున్నారు?’ అని ప్రశ్నించారు. నియామకాల్లో ‘సెలక్టివ్’ విధానం వల్ల సమస్య ఏర్పడుతుందని, కొంత మంది జడ్జీలు తమ సీనియారిటీ కోల్పోతారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. సిఫార్సులకు ఆమోదం తెలుపడంలో కేంద్రం చేస్తున్న ఆలస్యంపై ఈ ఏడాది సెప్టెంబర్లోనూ సుప్రీంకోర్టు తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2022, నవంబర్ 11 నుంచి హైకోర్టు కొలీజియాలు చేసిన దాదాపు 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నది.